ఆరు నెలలుగా ప్రయాణికులను వూరిస్తూ వచ్చిన తిరుపతి - జమ్ముతావి మధ్య నడిచే అత్యాధునిక సూపర్ఫాస్ట్ హమ్సఫర్ రైలు ఎట్టకేలకు తిరుపతికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి గుంతకల్ వరకు ట్రయల్రన్గా నడపనున్నారు. వారం రోజుల్లో తిరుపతి నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ప్రత్యేకతలు
జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైలు ప్రత్యేకతలు కల్గి ఉంది. భద్రతలో పాటు భరోసా కల్గించే విధంగా అన్ని ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకున్నా జనరేటర్ల సాయంతో నడిపే అవకాశం ఉంది. ఎల్ఈడీ వెలుగులు అందిస్తుంది. ప్రతి రైల్వేస్టేషన్ వద్ద పలానా రైల్వేస్టేషన్ వచ్చిందని చెబుతూ డిస్ప్లే చేయడంతో పాటు స్టేషన్ సమీపిస్తుండగా స్పీకర్లలో వూరు పేరు తెలుపుతూ ప్రకటనలు కూడా...
more... వినిపిస్తారు. రైలులోకి రెండువైపులా ఎవరెవరు ఎక్కుతున్నారు.. దిగుతున్నారో రికార్డు చేసేందుకు, రైలు లోపల నడిచే వారి కదలికలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా బోగీకి ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. రైలు ప్రమాదానికి గురి కాకుండా హ్రైడాలిక్ బ్రెకుల విధానం ఉంది.
తిరుపతి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు..
తిరుపతి నుంచి వైష్ణవీదేవీ ఆలయానికి వెళ్లు ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఇచ్చిన హామీ మేరకు రైల్వే మంత్రి సురేష్ప్రభు రైలును తిరుపతి నుంచి ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం తిరుపతి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి 23 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
బోగీల సామర్థ్యం
మొత్తం 24 బోగీలు ఉన్నా.. 21 కోచ్లు ఉపయోగంలో ఉంటాయి. మిగతా బోగీలు స్పేర్గా ఉంచుకోనున్నారు. ఇందులో రెండు బోగీలు థర్డ్ఏసీ, మిగతా బోగీలు సెకండ్ ఏసీ కల్గి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.